Pages

Thursday, November 20, 2014

21న డీఎస్సీ నోటిఫికేషన్

* డిసెంబరు 3 నుంచి ఆన్ లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌
* మే 9, 10, 11 తేదీల్లో రాత‌ప‌రీక్షలు
* జూన్ 28న ఫ‌లితాల వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో 9,061 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి డీఎస్సీ - 2014 నోటిఫికేష‌న్‌ను నవంబరు 21న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 1849 స్కూల్‌ అసిస్టెంట్లు, 812 లాంగ్వేజ్ పండిట్స్, 156 పీఈటీలు, 6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. డీఎస్సీని ఇకపై... ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్ - కమ్ - టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ( టెట్ - కమ్ - టీఆర్‌టీ )గా వ్యవహరించబోతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం మేరకు, మంత్రి గంటా ఆదేశాలను అనుసరించి మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హా డీఎస్సీ - 2014 అర్హతలపై న‌వంబ‌రు 19నే మార్గదర్శకాలు విడుదల చేశారు. సెప్టెంబరు 5వ తేదీనే ఈ డీఎస్సీ ప్రక‌ట‌న‌ జారీ చేయాల్సి ఉండగా... బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో మంత్రి గంటా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నుంచి కూడా బీఎడ్‌ వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తులు వచ్చినప్పటికీ... సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర మార్గదర్శకాల దృష్ట్యా ఏమీ చేయలేకపోయినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. నెలలు గడిచినా ప్రకటన రాక అభ్యర్థుల్లో ఆందోళన అలముకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీకి సిద్ధమైంది.
మార్గదర్శకాలు:
* జనరల్‌ అభ్యర్థులకు 2014 జులై 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే గరిష్ఠ వయోపరిమితి 45 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకైతే 50 సంవత్సరాలకు మించకూడ‌దు.
* సెకండరీ గ్రేడ్‌, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను 180 మార్కులకు నిర్వహిస్తారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టుల భర్తీ కోసం 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
* ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షను మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. ఇందులో 15 నిమిషాలను ప్రశ్నలు చదివేందుకు కేటాయిస్తారు.
* ఎస్‌జీటీ పోస్టులు డీఎడ్‌ పట్టభద్రులకే కేటాయిస్తారు.
* టెట్‌లో ఇప్పటికే అర్హత సాధించిన వారు కూడా ఈ పరీక్షను రాయాల్సిందే. ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణనలోనికి తీసుకుంటారు. ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ సర్టిఫికేట్‌కు ఏడాదిపాటు గుర్తింపు ఉంటుంది.
* దూరవిద్యలో పట్టభద్రులకు అర్హతలను ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ముఖ్యమైన తేదీలు

* డిసెంబరు 3 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
* 2015 మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు జరుగుతాయి.
* 2015 జూన్‌ 28న రాతపరీక్ష ఫలితాలను వెల్లడిస్తారు.

No comments:

Post a Comment